తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయం వద్ద సీఎం కేసీఆర్ కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు సీఎంకి వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను సీఎం పరిశీలించారు. అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో ఆలయ అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు
సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే మంజూరు 100 కోట్ల రూపాయలతో పాటు మరో 500 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్టు ఈ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొండగట్టును దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆంజనేయ దేవాలయంగా అభివృద్ధి చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం సూచించారు. దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కొండగట్టు ఆలయం అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్టుగా తీసుకోవాలని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, భక్తులకు సకల వసతులతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. హనుమాన్ జయంతి పండుగను దేశంలోనే అత్యంత గొప్పగా కొండగట్టులో జరుపుకోవాలని అన్నారు. 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. పుష్కరిణి, కోనేరు, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, 86 ఎకరాల స్థలంలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు సహా పలు అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సూచనలు చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధిపై , సమీక్షలు నిర్వహిస్తుంటానని, మళ్ళీ కొండగట్టుకు వస్తానని ఈ సందర్భంగా అధికారులతో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE