చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. వారి పదవీ విరమణ వయసుపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థల్లో అమలులో ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. గతంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా సర్కార్ ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్గా అమలు కానుంది.
ఈ నిర్ణయం వల్ల 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం లభిస్తుంది. అయితే మళ్లీ జాబ్లో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్కు ఎలాంటి జీతం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ గ్యాప్ పీరియడ్ను సీనియారిటీ లేదా ప్రమోషన్ల కోసం పరిగణనలోకి తీసుకోరని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వరకు పనిచేసిన ఉద్యోగులకు పూర్తి స్థాయి సర్వీస్ బెనిఫిట్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 60 ఏళ్లకు పదవీ విరమణ పొంది, తిరిగి విధుల్లో చేరేందుకు ఆసక్తి లేని ఉద్యోగులకు పాత నిబంధనల ప్రకారమే రిటైర్మెంట్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ముఖ్యాంశాలు: ఈ నిర్ణయాన్ని అయా సంస్థల్లో అమలు చేసేందుకు వీలుగా సర్వీస్ రూల్స్లో అవసరమైన సవరణలు చేయాలని అన్ని రంగాల యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రతి సంస్థ తమ ఆర్థిక పరిస్థితిని మరియు నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీలకు వెంటనే ఈ ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్పొరేషన్ మరియు పీఎస్యూ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీనియర్ ఉద్యోగుల అనుభవాన్ని మరింత కాలం వినియోగించుకోవడానికి ఇది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కొన్ని సంస్థలు తమ పరిధిలోని ఉద్యోగుల జీతభత్యాల భారాన్ని ఎలా సమన్వయం చేసుకుంటాయనేది వారి అంతర్గత ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.






































