కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై జూన్ 8, సోమవారం నాడు సీఎం కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల సీఎం కేసీఆర్ ను కలిసి సినిమా, టివి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్ల తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్, విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీనిని అనుసరించి సీఎం కేసీఆర్ షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu