భోగాపురం ఎయిర్‌పోర్ట్ యూడీఎఫ్ ఛార్జీలు ఖరారు.. ప్రకటించిన ఏఈఆర్‌ఏ

AERA Announced UDF Charges For Passengers at Bhogapuram Airport

భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారితో పాటు, అక్కడికి చేరుకునే ప్రయాణికులపై వసూలు చేయనున్న యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (UDF) ఛార్జీలను విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ ఏఈఆర్‌ఏ (Airports Economic Regulatory Authority) అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GVIAL) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమైన రోజు నుంచే ఈ కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి.

దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు వేర్వేరు యూడీఎఫ్ రుసుములు

ఏఈఆర్‌ఏ నిర్ణయించిన టారిఫ్ ప్రకారం, భోగాపురం విమానాశ్రయం నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికులు ఒక్కొక్కరు రూ.835, అంతర్జాతీయ ప్రయాణికులు రూ.1,255 యూడీఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి భోగాపురానికి చేరుకునే దేశీయ ప్రయాణికులకు రూ.355, విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.545 చొప్పున యూడీఎఫ్ వర్తించనుంది. ప్రయాణ టికెట్ బుకింగ్ సమయంలోనే ఈ రుసుములు చేర్చబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రపంచ స్థాయి సౌకర్యాల నిర్వహణకు యూడీఎఫ్

ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు అత్యాధునిక సేవలు, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చేందుకు యూడీఎఫ్ ద్వారా వచ్చే ఆదాయం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. టెర్మినల్ నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, భద్రతా వ్యవస్థల ఆధునీకరణ వంటి అవసరాలకు ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నాయి.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్రలో విమానయాన రంగానికి కొత్త ఊపు రానుందని ప్రభుత్వం, విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పారిశ్రామిక, పర్యాటక, వ్యాపార రంగాలకు ఇది మరింత ఊతమివ్వడంతో పాటు, అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here