సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం.. 3,700కి పైగా మొబైల్ యాప్స్ బ్లాక్‌ చేసిన కేంద్రం

Centre Blocks 3,718 Fraudulent Mobile Apps and 15.75 Lakh SIM Cards

దేశంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మోసపూరిత లోన్‌ యాప్‌లతో పాటు మొత్తం 3,718 మొబైల్‌ అప్లికేషన్లను నిషేధించినట్లు కేంద్ర హోంశాఖ లోక్‌సభకు వెల్లడించింది. బీజేపీ ఎంపీ పి.సి. మోహన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

భారత సైబర్‌ నేర సమన్వయ కేంద్రం (I4C) ద్వారా సమాచార సాంకేతిక చట్టం-2000లోని సెక్షన్‌ 69(ఎ), 79(3)(బి) కింద ఈ యాప్‌లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రజలను మోసం చేసేందుకు ఉపయోగిస్తున్న అనుమానాస్పద యాప్‌లను గుర్తించి వాటిని బ్లాక్‌ చేసినట్లు వివరించింది.

15.75 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన కేసుల్లో 15.75 లక్షలకు పైగా సిమ్‌ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ (IMEI) నంబర్లను కూడా బ్లాక్‌ చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నేరగాళ్లు ఉపయోగించే మొబైల్‌ కనెక్షన్లు, పరికరాల ద్వారా మోసాలు కొనసాగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

ఇక ‘సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ (CFCFRMS)కు అందిన ఫిర్యాదులపై కూడా కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. ఇప్పటివరకు 32.80 లక్షల సైబర్‌ మోసాల ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. వీటి ఆధారంగా బాధితుల సొమ్ములో రూ.11,158 కోట్లకు పైగా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోగలిగినట్లు పేర్కొంది.

రూ.25,698 కోట్ల నకిలీ లావాదేవీలకు అడ్డుకట్ట

బ్యాంకులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో **2024 సెప్టెంబర్‌ 10న ‘సస్పెక్ట్‌ రిజిస్ట్రీ’**ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. అనుమానాస్పద ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో నమోదు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా లభించిన వివరాల ఆధారంగా ఇప్పటివరకు రూ.25,698 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను తిరస్కరించినట్లు వెల్లడించింది.

1930 హెల్ప్‌లైన్‌తో అవగాహన

సైబర్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌తో పాటు ‘సైబర్‌ దోస్త్‌’ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. మోసానికి గురైన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును నిలిపివేసే అవకాశాలు మెరుగుపడతాయని సూచించింది.

బాధితులకు సొమ్మును వేగంగా తిరిగి అందించేందుకు ‘మనీ రీస్టోరేషన్‌ మాడ్యూల్‌’, బ్యాంకు ఖాతాల స్తంభనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ‘గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ మాడ్యూల్‌’ ద్వారా ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOP) అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here