ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3, శనివారం నాడు ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి-లేహ్ జాతీయ రహదారిపై రోహతాంగ్ పాస్ వద్ద 9.02 కిలోమీటర్ల మేర పొడవైన టన్నెల్ ను నిర్మించారు. ఈ టన్నెల్ వలన మనాలి నుండి లద్దాఖ్లోని లేహ్ వరకు ప్రయాణ సమయం 5 గంటలు తగ్గనుంది. భారీగా ఏర్పడే మంచు వలన ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆరునెలల పాటు రాకపోకలు నిలిపివేయబడేవి. దీంతో ఈ ప్రాంతంలో టన్నెల్ నిర్మించాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని ముందుగా రోహతాంగ్ టన్నెల్ గా పిలిచేవారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞాపకార్థం ఈ టన్నెల్ కు ఆయన పేరు పెట్టాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2019 లో నిర్ణయించింది. ఆరు సంవత్సరాలలోనే టన్నెల్ నిర్మాణాన్ని కేంద్రం పూర్తి చేసింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ టన్నెల్ ప్రారంభించిన క్షణం చారిత్రాత్మకమని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కల సాకారమైన రోజని పేర్కొన్నారు. ఈ టన్నెల్ భారత సరిహద్దు మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సుల యూనివర్సిటీల విద్యార్థులకు అటల్ టన్నెల్ పై అధ్యయనం చేయడానికి అవకాశం కల్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు మోదీ సూచించారు. ఈ టన్నెల్ ఎలా నిర్మించబడిందో విద్యార్థులు నేర్చుకోవాలని అన్నారు. టన్నెల్ ప్రారంభించిన అనంతరం కొద్దిసేపు ప్రధాని మోదీ అందులో నడిచారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే, హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu