ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బీజేపీ, జనసేన పార్టీ కీలక నేతల సమావేశంలో అభిప్రాయపడినట్టు జనసేనపార్టీ తెలిపింది. ఈ మేరకు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా పని చేయడం లేదని సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి వి.సతీష్ ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. వ్యాధి నివారణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ఇరు పార్టీల అగ్రనాయకులు పేర్కొన్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో బీజేపీ పార్టీ నుంచి సతీష్ తో పాటు జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్, రాజ్యసభ సభ్యులు మరియు అధికార ప్రతినిధి జి.వి.ఎల్.నరసింహ రావు, పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్, జనసేన నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
“కరోనా నివారణలో ఎక్కడ లోటుపాట్లు ఉంటే అక్కడ ప్రజా పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఉభయపక్షాల నేతలు నిర్ణయించారు. ఈ విపత్కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుందో అధ్యయనం చేసిన తరువాత వాటి వివరాలను మీడియాతో పంచుకోవాలని నిర్ణయించారు. ఈ పాటికే ఆత్మనిర్భర భారత్ కు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా గరీబ్ కళ్యాణ్ యోజన, సూక్ష్మ- చిన్న- మధ్య స్థాయి పరిశ్రమలు, వాణిజ్య సంస్థ (ఎం.ఎస్.ఎం) లకు అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులపై పర్యవేక్షణ జరిపి సమీక్షించాలని సమావేశం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లబ్ధిదారులకు అందించ లేకపోయిందని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల రూపాయలను అందించిందని సమావేశం గుర్తు చేసింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాలని, దీని కోసం కార్యాచరణను సిద్ధం చేయడానికి కొద్ది రోజులలో మరోసారి ఇటువంటి సమావేశం నిర్వహించాలని సమావేశం నిశ్చయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం, ప్రభుత్వ భూములు, గుంటూరు మార్కెట్ అమ్మకం, విద్యుత్ బిల్లుల విషయంలో బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా జరిపిన పోరాటంపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. అదే విధంగా లాన్ డౌన్ కాలంలోనూ, ఆ తరువాత ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి నిత్యావసరాలు అందించి ఆదుకున్న తీరుపై సమావేశంలో పాల్గొన్న నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సేవ ఇలా కొనసాగాలని ఆకాంక్షించారని” నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu