తెలంగాణ రాష్ట్రంలో జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,671 కి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు ‘హోమ్ ఐసోలేషన్ కిట్’ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి ఐసోలేషన్ కిట్ ను వైద్య సిబ్బంది నేరుగా ఇంటికెళ్లి అందజేస్తున్నారు. ఈ కిట్ లో చికిత్సకు అవసరమైన మందులు, మాస్కులు, హ్యాండ్ వాష్, శానిటైజర్, గ్లౌజులు,హోమ్ ఐసోలేషన్ జాగ్రత్తలతో కూడిన బుక్లెట్ సహా అన్నింటిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ ఉన్నా కూడా బాధితులందరికీ ఈ కిట్లను అందజేస్తున్నారు. అదేవిధంగా వైద్య సిబ్బంది ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu