ప్రముఖ జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జానపద గేయాలతో ఆయన ప్రజలను చైతన్య పరిచేవారు. తన జీవిత కాలంలో ఎన్నో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాణంపోసిన వంగపండు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కొన్ని సినిమాల్లో పాటలను కూడా రచించారు. ఆయన రాసి, పాడిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాట ఒకప్పుడు ఉర్రుతలూగించింది. 1972 లో జననాట్యమండలిని స్థాపించారు. అలాగే 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్నారు. వంగపండు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.
వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు-సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారన్నారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. “వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పాముని పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని” ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. “అణగారిన వర్గాలలో చైతన్యం కలిగించేలా జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన విప్లవకవి, ప్రజాకవి వంగపండు ప్రసాదరావుగారు ఇకలేరన్న వార్త ఎంతో బాధను కలిగించింది. ఉత్తరాంధ్ర వారే అయినా విశ్వవ్యాప్తంగా ఆయన సాహిత్యం ప్రజలను ఉత్తేజపరచింది. తెలుగు సాహితీలోకానికి ఇది తీరని లోటని” టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu