సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సున్నం రాజయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. 1999, 2004, 2014లలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆంధప్రదేశ్ పునర్విభజన అనంతరం భద్రాచలం నియోజకవర్గం కింద ఉన్న కీలక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. దీంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే అయినప్పటికి ఆర్టీసీ బస్సులలో తిరుగుతూ నిరాడంబరంగా ఉండేవారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ సున్నం రాజయ్య ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. సున్నం రాజయ్య మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆయన అంత్యక్రియలు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu