మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీములోకి మరో ఆరుగురికి చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవరించిన హరీష్ రావు, కేటీఆర్ లకు మళ్ళీ మంత్రివర్గంలో చోటు కల్పించారు. కేబినెట్ లోకి తొలిసారిగా ఇద్దరు మహిళలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లను తీసుకోవడంతో పాటు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ లకు మొదటిసారి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ ఆరుగురు నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. టి. హరీష్ రావు, కె.టి. రామారావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొదటి విస్తరణలో 12 , ఇప్పుడు 6 గురు చేరడంతో మొత్తం 18 మందితో మంత్రివర్గం పూర్తిగా కొలువుతీరినట్టు అయింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, సీఎస్ ఎస్.కే. జోషీ తదితరులు పాల్గొన్నారు.
నూతన మంత్రుల శాఖలు:
- మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కొద్దిసేపటికే శాఖలు కేటాయించారు.
- హరీష్ రావును ఆర్ధిక మంత్రిగా నియమించారు
- కేటీఆర్ కు మున్సిపల్, ఐటీ, పరిశ్రమలు మైనింగ్ శాఖలను అప్పగించారు.
- సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ
- గంగుల కమలాకర్ కు బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు
- సత్యవతి రాథోడ్ కు ఎస్టీ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖలు
- పువ్వాడ అజయ్ కుమార్ కు రవాణా శాఖ ను కేటాయించారు.
- జగదీష్ రెడ్డి కి విద్యాశాఖను మార్చి, ఇంధన శాఖను కేటాయించారు.
- కీలకమైన రెవిన్యూ, నీటిపారుదల, గనుల శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారు.
నూతన మంత్రులు టి. హరీశ్రావు, కె.టి. రామారావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=HUIIjMOWSi8]