తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం అవసరమైన స్లాట్ బుకింగ్ పద్ధతిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లాంఛనంగా శుక్రవారం నాడు బిఆర్ కెఆర్ భవన్ లో ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ద్వారా పారదర్శకంగా, సులభతరంగా, ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్లైన్ పద్ధతి ద్వారా జరుగుతాయని సీఎస్ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభమైన పద్ధతిలో ఆస్తుల విలువలకనుగుణంగా ఆన్లైన్ పద్ధతిలో, నెట్ బ్యాంకింగ్ ద్వారా చలాన్ చెల్లింపులు చేసుకొని తదనంతరం బుక్ చేసుకున్న స్లాట్ కు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుందని సీఎస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి పాత చార్జీలే అమలులో ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేయవలసిన ప్రాపర్టీ వివరాలు నమోదు చేయగానే సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీ, స్టాంపు డ్యూటి, ఇతర చార్జీల చెల్లింపు వివరాలు జనరేట్ అవుతాయన్నారు. ఆధార్ ఇవ్వని వారికోసం ప్రత్యేక పద్ధతిని పాటిస్తామని చెప్పారు.
ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకూ 24 స్లాట్ లు కేటాయింపు:
ప్రస్తుతం ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ లను కేటాయిస్తామని, డిమాండ్ మేరకు వాటిని పెంచడం జరుగుతుందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు వార్ రూంలో పనిచేస్తున్న టెక్నికల్ టీం పరిష్కరిస్తుందని అన్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ కోసం www.registration.telangana.gov.in అనే వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకోవలసి ఉంటుందన్నారు. స్లాట్ బుకింగ్ కోసం టీ ఫిన్, పీటీఐఎన్ అసెస్మెంట్ నెంబర్ లను ఫీడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవి లేని వారు స్థానిక సంస్థల వద్ద ధరఖాస్తు చేయగానే 2 రోజులలో వారికి అధికారులు పీటీఐఎన్ నెంబరును జారీ చేస్తారన్నారు. ప్రస్తుతం 96 శాతం నుండి 97 శాతం దాకా రిజిస్ట్రేషన్ సర్వీసులను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న సమయానికి అనుగుణంగా కొనుగోలుదారులు, అమ్మకం దారులు, సాక్షులు తమ ఐడి ప్రూఫ్ లతో హాజరుకావలసి ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు.
24 లైన్లతో కాల్ సెంటర్ ఏర్పాటు:
ప్రస్తుతం సేల్, మార్టిగేజ్ విత్ పొసెషన్, మార్టిగేజ్ విత్ అవుట్ పొసెషన్, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్, గిఫ్ట్, డెవలప్ మెట్ అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ విత్ అవుట్ పొసెషన్ లాంటి సర్వీసులు లభిస్తాయని సీఎస్ తెలిపారు. డాటా సిస్టమ్ కు సంబంధించి అవసరమైన సెక్యూరిటి వ్యవస్ధను ఏర్పాటు చేసామన్నారు. 24 లైన్లతో కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు. కాల్ సెంటర్ నెంబర్ 18005994788 కు ఫిర్యాదు చేస్తే ఐటి శాఖ పరిష్కరిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లకు ప్రత్యేకంగా ధరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పించామని సీఎస్ అన్నారు.
రిజిస్ట్రేషన్ అనంతరం ఈ-పాస్ బుక్ జారీ అవుతుందని, 7 నుండి 10 రోజుల లోపు రెగ్యులర్ పాస్ బుక్ జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. వ్యవసాయ రిజిస్ట్రేషన్ కు సంబంధించి 55216 లావాదేవీలు జరిగాయని, ధరణికి 1.24 కోట్ల హిట్స్ వచ్చాయని, 74 వేల స్లాట్ బుకింగ్ లు జరిగాయని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ శాఖ సిఐజి శేషాద్రి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ