ఈ రోజు తెలంగాణ శాసనమండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టారు. మండలిలో చర్చ అనంతరం కొత్త రెవెన్యూ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రెవెన్యూ బిల్లుపై మండలిలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పూర్తిస్థాయి వివరణ ఇచ్చారు. కొత్త చట్టం వచ్చాక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారమే ఉండదని పేర్కొన్నారు. కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ధరణి పోర్టల్ లో మార్పులు చేసేందుకు తహసీల్దార్ లకు ఎలాంటి అవకాశం లేదన్నారు. సబ్ రిజిస్టార్ లకు కూడా ఇకపై ఎలాంటి విచక్షణా అధికారం లేదని సీఎం అన్నారు.
ధరణి పోర్టల్లో ఒకసారి వివరాలు అప్డేట్ అవ్వగానే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేట్ కాపీలు వెంటనే వస్తాయన్నారు. నూతన విధానంలో బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫోటోతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని, ఈ వివరాలలు ఇవ్వకుండా తహసీల్దార్ లకు పోర్టల్ తెరుచుకోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు, ప్రజలకు లంచాలు ఇచ్చే బాధ తప్పించి, వారి హక్కులను కాపాడడమే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అన్నారు. చర్చ అనంతరం రెవెన్యూ బిల్లుకు చెందిన భూమిపై హక్కులు, పాస్పుస్తకాల బిల్లు-2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు బిల్లు-2020 లను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu