రాష్ట్రంలో బార్లు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 22 న మొదటిసారిగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో బార్లు మూసివేసే ఉంచారు. తాజాగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బార్స్, క్లబ్బులు మరియు టూరిజం బార్లు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అన్ని బార్లు, క్లబ్స్ లో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
బార్లు, క్లబ్స్, టూరిజం బార్లులలో పాటించాల్సిన నియమాలు:
- బార్ల ఎంట్రీ పాయింట్ వద్ద నాన్ టచ్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్/థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
- సరైన క్యూ విధానం పాటించాలి, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
- పార్కింగ్ ప్రాంతంలో గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలి.
- హ్యాండ్ శానిటైజర్ కోసం సదుపాయం కల్పించాలి.
- బార్ సిబ్బంది మరియు పనిచేసే వారంతా మాస్కులు ధరించాలి.
- సమావేశాలు, మ్యూజిక్ ఈవెంట్స్, డ్యాన్స్ ఫ్లోర్స్ పై నిషేధం.
- ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం మొత్తం బార్ ప్రాంగణాలను శుభ్రపరచడం మరియు శానిటైజషన్ చేయాలి.
- కొత్త కస్టమర్ సీటులోకి వచ్చే ముందు సీటును శానిటైజ్ చేయాలి.
- బార్ ప్రాంగణంలో సరైన వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి.
- A4 షాప్స్ పర్మిట్ రూమ్లను తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మూసే ఉంచాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu