తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై సందిగ్థత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ రోజు మీడియాతో మాట్లాడారు. దసరా పండుగ సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికోసం బస్సులు నడపడానికి ప్రయత్నించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో ఇంకా ఒప్పంద వ్యవహారం పూర్తికానందున సాధ్యపడలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచినట్టు మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. పంచలింగాల, కల్లుగూడెం, వాడపల్లి, పైలాన్, గరికపాడు, జీలుగుమిల్లి చెక్పోస్టు వద్ద బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ప్రయాణికులు సరిహద్దు వద్దకు చేరుకుంటే అక్కడి నుంచి గ్రామాలకు చేరవేసేందుకు పెద్ద సంఖ్యలో బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణకు బస్సు సర్వీసులు నడిపేందుకు గత జూన్ 18 నుంచి టిఎస్ఆర్టీసీ అధికారులతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారని మంత్రి తెలిపారు. దసరా సందర్భంగా టిఎస్ఆర్టీసీ కార్యాలయానికి సెలవులు కావడంతో నిర్ణయంలో ఆలస్యం జరిగిందని అన్నారు. టిఎస్ఆర్టీసీతో చర్చలు ముగిసిన అనంతరం పూర్తి స్థాయిలో బస్సులు నడుపనున్నట్టు మంత్రి పేర్నినాని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu