ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే ఏపీకి కేంద్ర బృందం రానుంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వ్యవసాయ, విద్యుత్, ఉపరితల రవాణా, హైవేలు, ఆర్థిక, జలశక్తి, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన పలువురు అధికారులుతో కూడిన కమిటీ ఏర్పాటుపై కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పరిశీలన అనంతరం కేంద్ర హోమ్ శాఖకు ఈ కమిటీ నివేదిక అందజేయనుంది.
మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం భారీ వర్షాల వలన రూ.4450 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని, తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu