కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 న అన్లాక్ 5.0 మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అన్లాక్ 5.0 మార్గదర్శకాలనే మరో నెల రోజులు పొడిగిస్తూ, నవంబర్ 30 వ తేదీ వరకు అవే అమల్లో ఉంటాయని మంగళవారం నాడు కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను ప్రజలు తప్పకుండా అనుసరించాలని కేంద్రం సూచించింది.
నవంబర్ 30 వరకు అమల్లో ఉండనున్న మార్గదర్శకాలివే:
- సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సులలో సీటింగ్ సామర్థ్యంలో 50% తో అనుమతి.
- క్రీడాకారులు ట్రైనింగ్ కోసం వాడే స్విమ్మింగ్ పూల్స్ కు అనుమతి.
- ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కు అనుమతి.
- పాఠశాలలు మరియు కోచింగ్ సంస్థలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకే నిర్ణయం.
- ఆన్లైన్/దూరవిద్య కొనసాగించాలి మరియు ప్రోత్సహించాలి.
- పీజీ సహా రీసెర్చ్ విద్యార్థులు లాబొరేటరీల్లో ప్రయోగాలు ప్రారంభించుకోవచ్చు.
- బిజినెస్ టూ బిజినెస్ ఎగ్జిబిషన్స్ కు అనుమతి.
- సామాజిక/విద్య/క్రీడలు/వినోదం/సాంస్కృతిక/మత/రాజకీయ వేడుకలు సహా ఇతర సమావేశాలకు ప్రస్తుతం 100 మంది వరకు అనుమతి ఇస్తుండగా, 100 మందికి పైగా అవకాశం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయాధికారం.
- హల్/ మూసిఉంచే ప్రదేశాల్లో నిర్వహించే సమావేశాల్లో గరిష్టంగా 50 శాతం నింపేందుకు అనుమతి. అలాగే గరిష్టంగా 200 మంది మించకూడదు. మాస్క్ ధారణ, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్/శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
- అంతరాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణాపై ఎలాంటి నిషేధం లేదు.
- ఇంటర్నేషనల్ ప్రయాణం (కేంద్రం అనుమతించిన ప్రయాణాలు).
- అన్ని కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్డౌన్.
- కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానికంగా లాక్డౌన్ విధించకూడదు.
- 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు అత్యవసరమైతే బయటకు రావడం తప్ప, ఇళ్లల్లోనే ఉండడం మంచిది.
- పరిస్థితుల అంచనా ఆధారంగా పై కార్యకలాపాలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోబడుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu