టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంగళవారం నాడు ఒక లేఖ రాసారు. ఉపాధి హామీ పధకాన్ని(ఎంజిఎన్ఆర్ఇజిఎ) నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఉపాధి హామీ పనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తుందని లేఖలో ప్రస్తావించారు. గత నాలుగు నెలల నుండి పని చేసిన వారికీ బిల్లులు మంజూరు చేయడం లేదని, కూలీలకు సరైన సమయంలో వేతనాలు అందడం లేదని మండిపడ్డారు. ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు సంబంధిత రాష్ట్ర మంత్రిని, అధికారులను కలిసినా ఫలితం లేదని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని చెప్పారు. కూల్చివేతలు, ఒప్పందాలను రద్దు చేయడంతో ప్రభుత్వ విధానాలు వివాదాస్పదంగా మారాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రాధాన్యక్రమంలో చెల్లించాలని కోరారు. కూలీల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
[subscribe]