ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 1, మంగళవారం నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రాబోతుంది. నూతన మద్యపాన విధానం ప్రకారం ఇకపై ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న ప్రైవేట్ మద్యం దుకాణాలు ఇకపై కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వమే 3,500 మద్యం దుకాణాలను అధికారికంగా నిర్వహించబోతుంది, ఇది వరకు రాష్ట్రం మొత్తం మీద 4,380 మద్యం దుకాణాలు ఉండగా, 880 దుకాణాలు తొలగించారు. ఇకపై మద్యం అమ్మకాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తున్నారు. దుకాణాలు పనిచేసే సమయ వేళల్ని మారుస్తూ సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీచేసింది. అదేవిధంగా బార్ల సమయం కూడ కుదించబోతున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం నాడు విడుదల కానున్నాయి.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. స్వదేశీ, విదేశీ మద్యం పై వాటి పరిమాణాన్ని బట్టి రూ.10 నుంచి రూ.250 వరకూ పెంచింది. ధరలు పెంచుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు సెప్టెంబర్ 30, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. మంగళవారం నుంచి మద్యం అమ్మకాలు కొనసాగించనున్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు అమ్మకాల్లో 4 శాతం కమిషన్ గా చెల్లించడానికి నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాల అద్దెలు, సిబ్బంది వేతనాలు చెల్లించినందుకు, దుకాణాల నిర్వహణకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు కమిషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
[subscribe]