ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్టులో భారత్, ఇన్నింగ్స్ 202 పరుగులతో ఘన విజయం సాధించి మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత్ బౌలర్ల ధాటికి రెండు ఇన్నింగ్స్ లలోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోర్ 132/8 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం రెండు ఓవర్లలోనే మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి 133 పరుగులకు ఆలౌట్ అయింది, భారత బౌలర్లు షమీ 3 , నదీమ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ టెస్టు సిరీస్ లో ఓపెనర్ గా వచ్చి రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ తో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు, మ్యాన్ అఫ్ ద సిరీస్ అవార్డు దక్కాయి.
ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారతజట్టు తోలి ఇన్నింగ్స్ లో 497/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. రోహిత్ శర్మ 212, అజింక్యా రహానే 115 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 51 పరుగులతో రాణించాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే 4 వికెట్లు, రబడా 3వికెట్లు పడగొట్టారు. అయితే దక్షిణాఫ్రికా జట్టు తోలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది, హంజా మాత్రమే 62 పరుగులతో రాణించాడు. ఉమేష్ యాదవ్ 3 వికెట్లు, షమీ, నదీమ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. తోలి ఇన్నింగ్స్ లో 355 భారీ పరుగుల ఆధిక్యం లభించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా జట్టుతో ఫాలో ఆన్ ఆడించాడు. రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు కనీస పోటీ ఇవ్వలేక 133 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టెస్టు సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేయడంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ లో 240 పాయింట్స్ తో భారతజట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది 60 పాయింట్స్ తో న్యూజిలాండ్ రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో ఉంది.