వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్లో యువ భారత్ అద్భుతం చేసింది. బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాపై భారత జట్టు 96 పరుగుల భారీ విజయంతో ఫైనల్కు చేరుకుంది. టీమిండియా యువ జట్టు ఫైనల్కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. ఆంటిగ్వాలోని కూలీస్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ యష్ ధుల్, షేక్ రషీద్ అద్భుతమైన భాగస్వామ్యంతో 290 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారత్ నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ 194 పరుగులకే కుప్పకూలింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటైన ఆస్ట్రేలియా జట్టు 42 ఓవర్లలోపే ఆలౌట్ అవటం విశేషం.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. కేవలం 37 పరుగులకే ఓపెనర్లు రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) వికెట్లను కోల్పోయింది. అయితే, కెప్టెన్ యశ్ ధుల్ సెంచరీతో, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ అర్ధ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. యశ్ ధుల్ 110 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 110 పరుగులు.. షేక్ రషీద్ 108 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 94 పరుగులు సాధించి సత్తా చాటారు. అనంతరం బౌలింగ్ లో.. విక్కీ ఓస్త్వాల్ మూడు, నిశాంత్ సింధు, రవికుమార్ చెరో రెండు వికెట్లు తీయగా.. కౌశల్ తాంబే, అంగ్క్రిష్ రఘువంశీ తలో వికెట్ తీశారు.
సెంచరీతో సత్తాచాటిన భారత సారథి యశ్ ధుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా, ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో.. అండర్-19 ప్రపంచకప్ లో అత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన జట్టుగా భారత్ జట్టు రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 లలో ఫైనల్ చేరిన టీమిండియా.. తాజా విజయంతో 2022లో కూడా ఫైనల్ చేరి వరుసగా 4 సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. కాగా, 2000, 2008, 2012, 2018లో భారత్ ప్రపంచకప్ గెలిచుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ