తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఊరట లభించింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్నిరోజుల క్రిత్రం చట్టబద్ధంగా ఎన్నికలకు ముందు జరిగే ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వానికి తెలిపిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లు తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించవద్దని కూడ అప్పుడు హైకోర్టు ఆదేశించింది. పూర్తి విచారణ అనంతరం తాజాగా అక్టోబర్ 22, మంగళవారం నాడు మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేస్తూ, ఇక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పు వెలువరించింది.
హైకోర్టు తీర్పుతో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనబోతుంది. రాష్ట్రంలో మొత్తం 13 కార్పోరేషన్స్, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ల పదవికాలం పూర్తికాకపోవడంతో మిగిలిన 10 కార్పోరేషన్స్ లలో మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. అదే విధంగా కొన్ని కారణాల వలన 5 మున్సిపాలిటీలలో, పదవీకాలం పూర్తి కానందువలన సిద్దిపేట, అచ్చంపేటలలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించరు. ఇక మిగిలిన 121 మున్సిపాలిటీలలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. గత కొంతకాలంగా మున్సిపల్ ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉంది, ఇప్పుడు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టనున్నాయి.
[subscribe]