తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ స్థానాల్లో శుక్రవారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ గా రిజ్వానా షమీమ్ పేర్లను మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి ప్రకటించారు. గుండు సుధారాణి వరంగల్ 29వ డివిజన్ నుంచి, రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి విజయం సాధించారు.
మరోవైపు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ గా ఫాతిమా జోహ్రో పేర్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. పునుకొల్లు నీరజ ఖమ్మం 26వ డివిజన్ నుంచి మరియు ఫాతిమా జోహ్రా 37వ డివిజన్ నుంచి విజయం సాధించారు.
ముందుగా ఖమ్మం కార్పొరేషన్ లో 60 వార్డులుకుగానూ టీఆర్ఎస్ కూటమి 45 వార్డులు (టీఆర్ఎస్ 43 + సీపీఐ 2) గెలుచుకుని విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ కూటమి 12 (కాంగ్రెస్ 10 + సీపీఎం 2), బీజేపీ 1, ఇతరులు 2 వార్డులు గెలుచుకున్నారు. ఇక వరంగల్ కార్పొరేషన్ లో 66 వార్డులుకుగానూ టీఆర్ఎస్ పార్టీ 48 వార్డులు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 4, బీజేపీ 10, ఇతరులు 4 వార్డులు గెలుచుకున్నారు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులగా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ ను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. అలాగే ఖమ్మం కార్పోరేషన్ పరిశీలకులగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డిని నియమించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ