దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మే 10వ తేదీ నుంచి మే 24 తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు సిద్ధమయ్యేలా మే 8 మరియు 9 తేదీల్లో అన్ని దుకాణాలు, సంస్థలను ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.
ఇక లాక్డౌన్ సమయంలో కిరాణా, కూరగాయలు, మాంసం, చేపలు విక్రయించే దుకాణాలను ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. టాస్మాక్ (మద్యం షాపులు) పూర్తిగా మూసివేయనున్నారు. రెస్టారెంట్లలో టేకావే, పార్శిల్ సేవలను అనుమతించగా, టీ షాపులు మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవచ్చని తెలిపారు. ఇక సామాజిక, రాజకీయ, వినోద, విద్య, క్రీడా సమావేశాలపై నిషేధం విధించారు. రాష్ట్రంలో అన్ని బీచ్లు మూసివేయనున్నారు. బ్యూటీ సెలూన్లు, స్పాస్, సెలూన్లు కూడా మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకు 13,23,965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 11,73,439 మంది కరోనా నుంచి కోలుకోగా, 15,171 మంది మరణించారు. ప్రస్తుతం 1,35,355 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ