ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల వేడుకలు టెహ్రాన్లో శనివారం అత్యంత భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి క్షిపణి దాడుల కారణంగా గత ఫిబ్రవరిలో ఆయన మరణించినప్పటికీ, తీవ్రమైన యుద్ధ వాతావరణం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ అంత్యక్రియల ప్రక్రియ సుమారు నాలుగు నెలల పాటు ఆలస్యమైంది.
తాజాగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ అధికార యంత్రాంగం ఈ చారిత్రాత్మక వీడ్కోలు వేడుకలకు శ్రీకారం చుట్టింది. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లాలో శని, ఆదివారాల్లో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆరు రోజుల పాటు సాగే ఈ జాతీయ సంతాప దినాల ప్రక్రియలో భాగంగా టెహ్రాన్, ఖోమ్ నగరాలతో పాటు ఇరాక్లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలా మీదుగా అంతిమయాత్ర సాగనుంది.
చివరగా జూలై 9న ఖమేనీ జన్మస్థలమైన మషద్ నగరంలోని పవిత్ర ఇమామ్ రెజా దర్గా (ష్రైన్) సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి దాడిలో మరణించిన ఖమేనీ కుమార్తె, మనవళ్లతో పాటు కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ భార్య పార్థివ దేహాలకు కూడా ఇవే వేడుకల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు హాజరవుతున్న ఈ వేడుకల్లో భారత ప్రభుత్వ ప్రతినిధుల బృందం కూడా అధికారికంగా పాల్గొంది. భారత ప్రతినిధులుగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ హాజరై దేశ ప్రజల తరఫున ఘన నివాళులర్పించారు.
వీరితో పాటు ఇరాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, పవన్ ఖేరా, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరియు అగా సయ్యద్ హసన్ ముసవి అల్ సఫావి కూడా టెహ్రాన్ చేరుకుని నివాళులు అర్పించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక, దౌత్య సంబంధాల కొనసాగింపునకు ఈ పర్యటన ఎంతో కీలకమైనదని విశ్లేషకులు భావిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతలు మరియు క్లిష్ట పరిస్థితుల ఎదురైనా తమ దేశం దృఢంగా నిలబడిందని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రభుత్వం ఈ భారీ అంత్యక్రియల వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.




































