ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు నవంబర్ 13, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ కేడర్ కు చెందిన నీలం సాహ్ని, డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఇటీవలే ఆమెను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేశారు. ఈ నేపథ్యంలో నీలం సాహ్నిను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(రాజకీయం) ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం తరువాత ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీరబ్కుమార్ ప్రసాద్ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం ఉదయం 11:20 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారిగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు.
[subscribe]