రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై నవంబర్ 14, గురువారం నాడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రఫెల్ విమానాల కొనుగోలు అంశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రఫెల్ పై గతంలో ఇచ్చిన తీర్పును మళ్ళీ సమీక్షించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నిర్ణయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. వేల కోట్ల విలువైన 36 యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ 14, 2018న కేంద్రానికి క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్సిన్హా రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తాజాగా రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపి, ఇకపై కోర్టు పర్యవేక్షణలో ఈ అంశంపై విచారణ అవసరం లేదని తేల్చిచెబుతూ పిటిషన్ ను కొట్టివేస్తూ తుది తీర్పు వెల్లడించింది.
అదేవిధంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్గాంధీ పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రచారంలో రఫెల్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్ విమర్శించడంతో, ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీ నేత మీనాక్షి రాహుల్ గాంధీపై పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఈ అంశంపై గతంలోనే రాహుల్ గాంధీ కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో, విచారణలో ఆయన క్షమాపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ రాహుల్ గాంధీని సున్నితంగా హెచ్చరిస్తూ కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది.
[subscribe]