2018, 2019 సంవత్సరాలకు గానూ ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను, దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్, మరో సీనియర్ నటి రేఖలకు ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు తమ ప్రతిభతో సేవలందించిన వారిని గుర్తించి, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందజేస్తున్నారు. ఈ అవార్డు ప్రదానంకు సంబంధించిన వివరాలను హీరో అక్కినేని నాగార్జున, టి.సుబ్బరామిరెడ్డితో కలిసి నవంబర్ 14, గురువారం నాడు మీడియా సమావేశంలో వివరించారు. అన్నపూర్ణ స్టూడియోస్లో నవంబర్ 17న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఈ అవార్డులను అందిస్తామని చెప్పారు. అలాగే ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్ ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.
2006లో ఈ అవార్డును ప్రవేశపెట్టగా వరుసగా దేవ్ ఆనంద్, షబానా అజ్మీ, నటి అంజలీదేవి అండ్ జయసుధ, గాయని లతా మంగేష్కర్, నటి వైజయంతిమాల, దర్శకుడు కె. బాలచందర్, నటి హేమమాలిని, దర్శకుడు శ్యామ్ బెనగల్, నటి శ్రీదేవి, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, సూపర్స్టార్ ఘట్టమనేని కృష్ణ, దర్శకుడు రాజమౌళి ఇప్పటివరకూ ఈ అవార్డులను అందుకున్నారు. ఏఎన్ఆర్ అవార్డు ప్రధానోత్సవం రోజునే అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా (ఏసీఎఫ్ఎం) తృతీయ స్నాతకోత్సవం కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి నటి రేఖ ముఖ్య అతిథిగా వ్యవహరిస్తారని చెప్పారు.