తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగి రెడ్డి, జూలై 14 తర్వాత ఎప్పుడైనా మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధంగా ఉందని తెలిపారు. ఎస్ఇసి నాగిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి వారి సలహాలను కోరారు. జూలై 14 కల్లా వార్డులకు సంబంధించిన రిజర్వేషన్స్ ఈసీ ఖరారు చేస్తుందని, దీని తరువాత తెలంగాణ మునిసిపల్ ఎన్నికలను ఈసీ ఎప్పుడైనా నిర్వహించగలదని ఆయన అన్నారు. జూలై 13 న, మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు మరియు ఇతర ఎన్నికల సిబ్బందితో ఈసీ సమావేశం నిర్వహించనుంది.
నాగిరెడ్డి ఎన్నికల సన్నాహాలు గురించి మాట్లాడుతూ, ఓటర్ల ముసాయిదా జాబితా జూలై 10 లోగా సిద్ధమవుతుందని, అయితే ఓటర్ జాబితా పై జూలై 12 వరకు వచ్చిన సలహాలు, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని, మరియు తుది ఓటర్ల జాబితా జూలై 14 న ఆయా వార్డులతో సహా విడుదల చేస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా మునిసిపల్ ఎన్నికల తుది తేదీలు ఎన్నికల నోటిఫికేషన్ కి 15 రోజుల ముందే ప్రకటించబడతాయి అని తెలియజేసారు. ఈ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎంలు) కు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించబడతాయి. మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసే పార్టీల అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ సింబల్స్ మరియు స్వతంత్ర అభ్యర్థుల కోసం, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సాధారణ చిహ్నాలు కేటాయించబడతాయి.