విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను(ఆర్ఐఎన్ఎల్)ను విక్రయించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం నాడు ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందన్నారు. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్కే ఆభరణం వంటిదని పేర్కొన్నారు. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం ఉక్కు పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయని, స్టీల్ ప్లాంట్ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని కేంద్రమంత్రికి విజయసాయి రెడ్డి వివరించారు.
ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని విజయసాయి రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో ఉత్పతి అయ్యే స్టీల్ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని, అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్ఐఎన్ఎల్ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్ఐఎన్ఎల్కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుందని చెప్పారు. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన వినతి పత్రంలో ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ