ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1931 కోట్ల రుణం మంజూరు చేస్తూ ఫిబ్రవరి 19, బుధవారం నాడు నాబార్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీడబ్ల్యూఆర్డీసీ)కి నాబార్డు ఈ రుణాన్ని మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్(ఎన్ఐడీఏ) కింద ఈ రుణాన్ని మంజూరు చేసినట్టు నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయం ప్రకటించింది.
చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 410 గ్రామాలకు సాగు మరియు తాగునీటిని అందించే విధంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ పథకం ద్వారా 53.50 టీఎంసీల సాగునీటిని ఖరీఫ్ సమయంలో 4 లక్షల 80 వేల ఎకరాల ఆయకట్టుకు మూడు దశల్లో అందించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే జల్లేరు వద్ద 14 టీఎంసీల సామర్థ్యం గల తాగునీటి రిజర్వాయర్ ద్వారా ప్రాజెక్టు సంబంధిత గ్రామాల్లో 26 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2022 మార్చి నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.
[subscribe]