ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవంబర్ 21, గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ) బకాయి ఉన్న రూ.78.22 కోట్ల నిధులను ఈ పర్యటనలో వారికీ అందజేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు చేయగా, జిల్లా మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఉదయం 9 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా సీఎం జగన్ పర్యటనకు బయలుదేరుతారు. 9.45 గంటలకు ముమ్మిడివరం మండలం గాడిలంకకు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఐ.పోలవరం మండలంలోని పశువుల్లంక గ్రామం చేరుకుంటారు, గ్రామంలో వైఎస్సార్ వారధి వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం ముమ్మిడివరం మండలంలోని కొమ్మనాపల్లికి గ్రామానికి చేరుకొని తొమ్మిది టూరిజం బోటింగ్ కంట్రోల్ రూములకు శంకుస్థాపన చేస్తారు. 10.40 గంటల నుంచి అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సభలో మత్స్యకార భరోసా మరియు జీఎస్పీసీ బకాయిను బాధిత మత్స్యకారులకు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడతారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 12 గంటలకు యానాం చేరుకుంటారు. పాండిచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి చేరుకొని ఆయన్ను పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి హెలికాప్టర్లో తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరుతారు.
[subscribe]