ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియం అమలుపై నవంబర్ 20, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశలో భాగంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు కానుంది.
అలాగే తరువాత సంవత్సరాలలో వరుసగా ఒక్కో క్లాసు పెంచుకుంటూ 7, 8, 9, 10 తరగతులలో కూడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలులో ఉన్నా కూడ తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఎన్సీఈఆర్టీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో చేపట్టే ఉపాధ్యాయ నియామకాల్లో ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
[subscribe]