మహారాష్ట్రలో గంట గంటకి అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 23, శనివారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవరించినందుకు అజిత్ పవార్ పై ఎన్సీపీ పార్టీ చర్యలు తీసుకోబోతుంది. అజిత్ పవార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అలాగే ఎన్సీపీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి కూడ తొలగించడంపై ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. ఎన్సీపీ పార్టీ ఆఫీసుకు చేరుకున్న పలువురు నాయకులు, కార్యకర్తలు అజిత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శరద్ పవార్ నిర్ణయించుకున్న నేపథ్యంలో అందుకు వ్యతిరేకంగా కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్, బీజేపీ పార్టీకి మద్ధతు తెలిపారు.
అయితే అజిత్ పవార్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు, ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై శరద్ పవార్, ఉద్దవ్ థాకరే సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్సీపీ-శివసేన- కాంగ్రెస్ కూటమికి 170 మంది ఎమ్మెల్యేల బలముందని, అజిత్ పవార్ వెంట 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని స్పష్టం చేశారు. మరో వైపు ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, పాకిస్తాన్ లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో మహారాష్ట్రలో బీజేపీ వ్యవరించిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు.
[subscribe]