ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ నవంబర్ 22, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుపుతున్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది. బార్లతో పాటుగా స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. నవంబర్ 19న బార్ల పాలసీపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 797 బార్లలో 40శాతం అనగా 319 మూసివేసి మిగిలిన 60 శాతం అనగా 478 బార్లకు జనవరి 2020 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి 2020-21 సంవత్సరానికి గాను బార్ పాలసీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
బార్లకు సంబంధించిన కొత్త పాలసీ జనవరి 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు రెండేళ్లపాటు అమలులో ఉంటుంది. గతంలో ఉన్న బార్ లైసెన్సు దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్సు ఫీజును ఏడాదికి రూ.25 లక్షలుగా, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.50 లక్షలు, ఐదు లక్షలకు పైగా జనాభా ఉంటే లైసెన్సు ఫీజును రూ.75 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ విధానం ద్వారా త్వరలో ఈ బార్ల కేటాయింపు చేపట్టనున్నారు.
[subscribe]