జీహెఛ్ఎంసీ మరియు కంటోన్మెంట్ పరిధిలో ప్రారంభమైన ప్రత్యేక మాప్ అప్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఖైరతాబాద్ లోని ఒల్డ్ సీఐబీ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలోని 4846 కాలనీలు, స్లమ్స్ ఏరియాలో వ్యాక్సిన్ వేయించుకోకుండా మిగిలి ఉన్న పౌరులకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక మాప్ అప్ డ్రైవ్ చేపట్టామని సీఎస్ తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా ప్రత్యేక టీమ్ లు ప్రతి ఇంటిని సందర్శించి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తిస్తారని తెలిపారు. ఈ టీమ్ లు వ్యాక్సినేషన్ వేయించుకునేలా ప్రజలను మోటివేట్ చేస్తారని, వారికి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, తేదిని, సమయంతో పాటు వారి వివరాలు ముందుగా తెలుపుతారని సీఎస్ తెలిపారు. ఇంటి సభ్యులందరి వ్యాక్సినేషన్ పూర్తి అయిన ఇంటి తలుపుల మీద ప్రత్యేక స్టిక్కర్ అతికిస్తారన్నారు.
హైదరాబాద్ నగరాన్ని 100% వ్యాక్సినేటేడ్ నగరంగా లక్ష్యాన్ని సాధించాలని ప్రత్యేక మాప్ అప్ డ్రైవ్ ను చేపట్టామని సీఎస్ అన్నారు. 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న కాలనీలలో కాలనీ ఆఫీస్ బేరర్ల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఇతర కాలనీలలో కూడా 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా వారిని ప్రోత్సహిస్తామన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు జీహెఛ్ఎంసీ మరియు వైద్య అధికారులను సీఎస్ అభినందిస్తూ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ఐఏఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ