గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ఘటనపై తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కారు ప్రమాద సంఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేసి వేయాలని, ఫ్లైఓవర్పై వేగ నియంత్రణ, రక్షణ చర్యలును స్వతంత్ర నిపుణులు కమిటీతో అధ్యయనం చేయాలని జిహెఛ్ఎంసీ చీఫ్ ఇంజినీర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించినట్టు తెలిపారు. ఈ రోజు జరిగిన ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరో వైపు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఘటనపై స్పందిస్తూ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియోను ప్రకటించారు.
వేగ నియంత్రణ చర్యల కోసం మూడు రోజుల పాటు ఈ ఫ్లైఓవర్ పై రాకపోకలు నిలిపివేస్తున్నట్టు జిహెఛ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. అయితే ఫ్లై ఓవర్ కింద వెళుతున్న ఓ మహిళ పై ఆ కారు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై స్వల్ప కాలంలోనే రెండోసారి ప్రమాదం చోటు చేసుకుంది.
[subscribe]