తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు అమలుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తామని స్పష్టం చేశారు. వివాహం అయిన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవ్వరూ కూడా అందోళన చెందవద్దన్నారు.
హుజురాబాద్ లో మిగిలిన వారికి మూడు రోజులలోపు నగదు జమ:
దళిత బంధు ద్వారా వచ్చిన రూ.10 లక్షల డబ్బులతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని, ఒక్కరూ 4 యూనిట్లు కూడా స్థాపించుకొవచ్చని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సహా 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న దళితులందరికి దళిత బంధు డబ్బులు అందుతాయని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకా డబ్బులు అందని దళిత కుటుంబాలందరికి మూడు రోజులలోపు వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని మంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. ఖాతాలలో జమ అయిన డబ్బులను ప్రభుత్వం వెనుకకు తీసుకోదని, ఆ డబ్బులతో స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవాలని మంత్రి సూచించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని మండలాల్లో మంగళవారం నాడు పర్యటించి దళిత బంధు రాని వారి వివరాలు సేకరించి డబ్బులు జమ చేయడంతో పాటు, క్రాస్ చెక్ చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గం లోని మండలాల క్లస్టర్ అధికారుల నుంచి దళిత బంధు అమలు తీరును మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అడిగి తెలుసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ