తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిసెంబర్ 4, బుధవారం నాడు మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించిన టీఎస్ ఐపాస్ ఐదోవార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ విషయంలో వారి వైఖరి మారాలని కోరారు. రాజకీయ కారణాలతో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. బుల్లెట్ రైలు అంటే ఢిల్లీ, ముంబయి లేనా, అభివృద్ధి విషయంలో హైదరాబాద్ గుర్తుకు రాదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాలలోని నగరాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన దిశలో ముందుకెళ్తున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాయని అయితే మన దేశంలో పనిచేసే రాష్ట్రాలను పట్టించుకునే దిశగా కేంద్రం ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు. పారిశ్రామికీకరణ విషయంలో కేంద్రం రాజకీయాలు చేర్చకూడదని, కేంద్రం సహకారం ఎలా ఉన్నా రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
[subscribe]