ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో డిసెంబర్ 20, శుక్రవారం నాడు జీఎన్ రావు కమిటీ సమావేశమైంది. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సీఎం వైఎస్ జగన్ తో సమావేశమై తుది నివేదికను సమర్పించింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు సందర్శించి రాజధానిపై అధ్యయనంతో పాటు పలు అంశాలపై ప్రజలనుంచి అభిప్రాయాలను స్వీకరించింది. ఇప్పటికే రాజధానిపై జరిపిన అధ్యయనంపై ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను కమిటీ అందజేసింది. తాజాగా అమరావతి, విశాఖ, కర్నూలుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి తుది నివేదికను సమర్పించింది.
ఈ సమావేశంలో నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు, సెక్రటరీ చల్లా విజయ్ మోహన్, సభ్యులు డాక్టర్ అంజలి మోహన్, కె.టి.రవీంద్రన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారావులతో పాటుగా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ఇటీవల సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించడంతో తుది నివేదికలో రాజధాని అంశంపై ఏం ప్రస్తావించారు? నివేదిక ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే విషయంపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకుంది. మరోవైపు ఈ నెల 27న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుండడంతో, కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాతనే కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.
[subscribe]