దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీలోని తీస్హజారీ కోర్టు సంచలనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20, శుక్రవారం నాడు కుల్దీప్ సెంగార్ కు యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. అంతేగాక బాధితురాలికి రూ.25 లక్షలు చెల్లించాలంటూ సెంగార్ కు కోర్టు జరిమానా వేసింది. 2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ లోని బంగేరుమౌ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కుల్దీప్సింగ్ సెంగార్ అత్యాచారం చేసినట్టు ఆరోపణ వచ్చింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలనుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో బీజేపీ అధిష్టానం పార్టీనుంచి సెంగార్ ను బహిష్కరించింది.
ఆ తరువాత బాధితురాలి విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా బాధితురాలి తండ్రిపై అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో తప్పుడు కేసులో ఇరికించారు. అనంతరం పోలీసు కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి మరణించాడు. ఈ క్రమంలోనే బాధితురాలు కారుకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా, సన్నిహిత బంధువులు ఇద్దరు మరణించారు, అలాగే లాయర్ సైతం గాయపడ్డాడు. ఈ పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో నుంచి ఢిల్లీ హైకోర్టుకు ఈ కేసును బదిలీ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్లో ఉంచింది. డిసెంబర్ 16న ఈ కేసులో కుల్దీప్సింగ్ సెంగార్ను కోర్టు దోషిగా నిర్ధారించగా, ఈ రోజు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
[subscribe]