ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 26, గురువారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా దిశ చట్టంపై చర్చించి, దిశ చట్టం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. న్యాయపరంగా, పోలీసు శాఖ పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దిశ చట్టం అమలు కావడం లేదనే మాట ఎక్కడా వినిపించకూడదని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎవరూ వేలెత్తిచూపకూడదని చెప్పారు. దిశ చట్టం అమలులో భాగంగా 13 కోర్టులు ఏర్పాటుకు అవసరమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ కోర్టుకు రూ.2 కోట్లు చొప్పున అవసరమవుతుందని అధికారులు చెప్పడంతో, వారం రోజుల్లోగా అవసరమైన డబ్బును డిపాజిట్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
అలాగే రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లుగా పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడానికి, మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్ లను వైజాగ్, తిరుపతిల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఫోరెన్సిక్ ల్యాబ్ లలో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ గౌతం సవాంగ్ సీఎం జగన్ కు తెలుపగా, ఆ పోస్టుల భర్తీకోసం జనవరి 1న నోటిఫికేషన్ విడుదల చేయాలనీ చెప్పారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఉన్న మహిళా పోలీస్స్టేషన్లను పూర్తీ స్థాయి సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
[subscribe]