ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో విశాఖ పట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో విశాఖపట్నం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న దగ్గరనుంచి సీఎంకు దారిపొడవునా అద్భుతమైన స్వాగతం లభించింది. సీఎం కాన్యాయ్పై ప్రజలు పూల వర్షం కురిపించారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరి వరకూ దాదాపు 24 కిలోమీటర్ల పొడవునా విశాఖ నగర ప్రజలు భారీ మానవహారంగా ఏర్పడి స్వాగతం పలికారు. సీఎం కాన్వాయ్ ఎదురుగా వెళ్లి సెల్ఫీలు దిగేందుకు యువకులు, ప్రజలు పోటీపడ్డారు.
విశాఖపట్నం పర్యటనలో భాగంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డుమార్గంలో కైలాసగిరి మీదకు చేరుకుని వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.379.82 కోట్లతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే అక్కడ నుంచి వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్వద్దకు చేరుకుని జీవీఎంసీ ఆధ్వర్యంలో రూ.905.50 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆర్కే బీచ్కు చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ను ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగనున్న విశాఖ ఉత్సవ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. విశాఖ ఉత్సవ్ లో ప్రసంగించిన తరువాత తిరిగి రాత్రి 7.40కి తాడేపల్లి నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు.
[subscribe]