జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజధానితో సహా ఇతర అంశాలపై ఈ రోజు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతిపై రూపొందించిన ఓ నివేదికను జనసేన పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకుడు నాగబాబు పవన్ కల్యాణ్ కు అందించారు. నివేదికను పరిశీలించిన అనంతరం రాజధానిప్రాంత రైతులతో స్వయంగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచే పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల రైతులతో రాజధాని అంశంపై ఆయన మాట్లాడనున్నారు. 13 జిల్లాల నుంచి ముఖ్య నాయకులు ఈ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాగా, మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అమరావతి గ్రామాల రైతుల చేస్తున్న ఆందోళనపై కీలకంగా చర్చించారు. అలాగే రాజధాని వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా విడుదల చేశారు.
[subscribe]