ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ను రద్దు చేస్తూ డిసెంబర్ 30, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో కోసం నూతన డీపీఆర్ సిద్ధం చేసేందుకు కొత్త కన్సెల్టెంట్కు బాధ్యతలు అప్పగించింది. ఓపెన్ టెండర్ విధానం ద్వారా విశాఖ మెట్రోకు కొత్త టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం ఎస్సెల్ ఇన్ఫ్రా కన్సార్షియం మాత్రమే సింగిల్ బిడ్ దాఖలు చేయడంతో ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్ను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది.
మరోవైపు టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముందుగా విశాఖ మెట్రో బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు అప్పగించింది. కొంత సమయం తర్వాత పీపీపీ పద్ధతిలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావించడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకుంది. అనంతరం మెట్రో రైలు బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్సీ)కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
[subscribe]