రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికోక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. “గడిచిన ఏడేండ్లుగా ఉద్యోగాల నియామకాల కోసం ఎదురుచూస్తున్న యువతీ, యువకులకు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన కొంత ఊరటనిచ్చింది. గత రెండేండ్లుగా కోవిడ్ మహమ్మారి సమస్యతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు పోటీ పరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే వరిస్థితి లేదు. 2014, 2018 లో విడుదల చేసిన టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ యువత కోసం ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటుచేసి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలున్నాయి. మారుమూల గ్రామాలనుండి శిక్షణ కొరకు జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసాలతో కూడిన అంశం. వీరికి ప్రభుత్వంవైపు నుండి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా వీలైనంత ఎక్కువమంది యువత ఉద్యోగాలు సాధించేందుకు ప్రభుత్వ చర్యలు దోహదపడాలి” అని అన్నారు.
ఉచిత అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించాలి:
“జిల్లా కేంద్రానికి ఒక స్టడీ సర్కిల్ కాకుండా నియోజకవర్గానికొక ఉచిత స్టడీ సర్కిలను ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చులు తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. కోచింగ్ కేంద్రాలలో విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ పొందుతారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉచిత అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించాలి. కోచింగ్ కేంద్రాలలో ప్రవేశం పొంది గుర్తింపు కార్డులు ఉన్నవారందరికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తను ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగ యువతను తీవ్ర ఇబ్బందులకు గర్తిచేస్తున్నాయి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లపై ప్రభుత్వం స్పందిస్తూ తమ పార్టీ శాసనసభ్యులు నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. పార్టీల ద్వారా ఏర్పాటు చేసే కోచింగ్ సెంటర్ల వల్ల రాగద్వేషాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి టీ-సాట్ మరియు ప్రభుత్వ స్టడీ సర్కిల్స్, కోచింగ్ కేంద్రాల ద్వారానే నిరుద్యోగ యువతకు శిక్షణ నివ్వాలి” అని పేర్కొన్నారు.
“ప్రతిజిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో గ్రంథాలయాల ఏర్పాటుతో పాటు నిరుద్యోగ యువతకు అవసరమైన కోచింగ్ మెటీరియల్ ఉచితంగా అందించాలి. ప్రభుత్వం ఇచ్చే శిక్షణా కేంద్రాలలో తెలుగుతో పాటుగా ఇంగ్లీషులోనూ కోచింగ్ ఇచ్చే విధంగా నైపుణ్యం కలిగిన అధ్యాపకులను నియమించాలి. రాష్ట్రంలో టెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి చాలా ఏళ్లు గడిచింది. దీనివల్ల ఈ కాలంలో డి.ఇ.డి, బి.ఇ.డి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లో నిరాశచెందకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకు వెంటనే టెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల నియామకాలకు పదేండ్ల వరకు వయోపరిమితిని సడలించింది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే అయినా 49 సంవత్సరాలకు ఉద్యోగం పొందే వారికి ఫెన్షన్ తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ అంశాలంన్నింటిని పరిగణలోకి తీసుకొని ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది” అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ