2019 నుంచి 2020 లోకి సరికొత్త ఆశలతో దేశ ప్రజలు అడుగుపెట్టారు. 2020కి ఆత్మీయంగా స్వాగతం చెబుతూ నూతన సంవత్సర వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రజలు ఇళ్లల్లో ఆనందంగా కేక్ లు కట్ చేసి సంబరాలను మొదలు పెట్టారు. దేశంలోని పలు నగరాల్లో యువకులు రోడ్లపైకి చేరుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో పలు ప్రాంతాల్లో యువకులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారు. నగర వాతావరణమంతా సందడి సందడిగా మారిపోయింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తో పాటుగా పలు ప్రధాన పట్టణాల్లో ప్రజలు సంతోషకర వాతావరణంలో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు వంటి పలు ప్రాంతాల్లో ప్రజలు ఆనందంతో స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోనూ ఈ 2020 సంవత్సరం ఆనందం నింపి అందరికి గుర్తుండిపోవాలని కోరుకున్నారు.
పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా దేశం అందరికంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరాన్ని ముందుగా ఆహ్వానించే దేశాల్లో ఒకటైన న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో సంబరాలు ఘనంగా జరిగాయి. అదే విధంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద లక్షల మంది ప్రజలు హాజరవ్వగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి. మరోవైపు జపాన్, దక్షిణ కొరియా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్లు దేశాలు మనకంటే ముందుగానే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి సంబరాలు జరుపుకున్నాయి.