తెలంగాణ రాష్ట్రం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ఈ రోజు రెండు ప్రధాన వేడుకలకు వేదిక అవుతోంది. శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఈరోజు ‘డోలోత్సవం’ వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే వసంతోత్సవం పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేయనున్నారు. సాధారణంగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం, డోలోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. హొలీ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణ ఏర్పాట్లకు పసుపు కొట్టం కార్యక్రమానికి ఆలయ అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంకురార్పణలో భాగంగా నిన్న సాయంత్రం అర్చకులు పవిత్ర గోదావరి నుంచి మేళతాళాల నడుమ తీర్థపు బిందెను తలపై పెట్టుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ పవిత్ర జలంతో స్వామివారికి ఆరాధన, దర్బార్ సేవ వంటి తంతును నిర్వహించారు.
అలాగే స్వామివారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు తయారీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. తొమ్మిది మంది ముత్తయిదువలు పసుపు కొమ్ములు దంచుతారు. ఆ పసుపు, కుంకుమతో 1,108 మంది మహిళలు తలంబ్రాలను కలుపుతారు. ఈ తంతుతో స్వామివారి కల్యాణానికి సంబంధించి పనులు ప్రారంభమైనట్లుగా భావిస్తారు. తదుపరి అర్చకులు వసంతుడిని ఆవాహన చేసి మంత్రాలను జపిస్తూ వసంతాన్ని ప్రోక్షిస్తారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన గోటి తలంబ్రాలను ఆలయ అధికారులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాలను వైభవంగా జరిపించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ