తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమంను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (మార్చి 28, సోమవారం) యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం ఉదయమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు యాదాద్రికి చేరుకున్నారు. యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు.
మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవంలో భాగంగా దివ్య విమాన గోపురంపైన శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అంతకుముందు బాలాలయంలోని స్వామివారు, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, వారి సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ తొలి పూజలు జరిపించిన అనంతరం భక్తులకు గర్భాలయంలోని స్వయంభువుల దర్శనం మొదలయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ