కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జనవరి 9, గురువారం నాడు హైదరాబాద్ లోని జలసౌధలో జరిగింది. బోర్డు యాజమాన్య చైర్మన్ ఆర్.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్తో పాటు ఇరు రాష్ర్టాల ఇంజినీర్ ఇన్ చీఫ్లు, ఇంజినీర్లు, బోర్డు కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల కేటాయింపుతో పాటుగా ఇప్పటి వరకు వాడుకున్న నీటి లెక్కలు, నీటి విడుదల, బోర్డుకు నిధుల కేటాయింపుపై చర్చించారు. అలాగే కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించే అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది.
సమావేశం అనంతరం చైర్మన్ ఆర్.కె.గుప్తా మాట్లాడుతూ, మే 31వ తేదీ వరకు రెండు రాష్ర్టాలకు 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తెలంగాణకు 140 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 84 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించినట్టు తెలిపారు. వరద సమయంలో ఏపీ వినియోగించుకున్న నీటి విషయంపై కూడా చర్చించినట్లు తెలిపారు. అదనపు 45 టీఎంసీలను పరిగణలోకి తీసుకోవడం, గృహవినియోగ జలాలను 20 శాతం పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ లేవనెత్తే అంశాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. మరోవైపు జనవరి 21వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ నిర్వహించే భేటీలో
ఇరు రాష్ర్టాల జలవనరుల శాఖ అధికారులు పాల్గొననున్నారు.
[subscribe]